గ్రేటర్ పరిధిలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్: సీఎస్ సోమేశ్ కుమార్
ABN , First Publish Date - 2021-08-21T23:35:52+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ నగరంగా రూపొందించేందుకు నగరంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ నగరంగా రూపొందించేందుకు నగరంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కోసం శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వందశాతం వ్యాక్సినేషన్లో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుంచి నగరంలోని 4846 కాలనీలు, మురికివాడల్లో వచేచ పదిహేను రోజుల్లోనే 360 లొకేషన్లలో ఈస్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
మొత్తం 175 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలు 150 ప్రాంతాల్లోనూ, 25 కంటోన్మెంట్ ఏరియాల్లో పర్యటించి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు ఒక్కో మొబైల్ వాహనంలో 2 వ్యాక్సిన్ వేసేవారు, ఒక డేటా ఆపరేటర్ ఉంటారని తెలిపారు. ఇక ఒక్కో కాలనీల్లో ఇద్దరు చొప్పున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వారు వ్యాక్సిన్ వేసునేలా వివరిస్తారు. ఏ ప్రాంతంలో ఏ సమయంలో వ్యాక్సిన్ వేస్తారో వారు ఇంటింటికి వివరిస్తారు. ఒక ఇంటిలో అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ ఇంటికి ఒక స్టిక్కర్ను అంటిస్తారు.
అవసరమైన మేరకు వ్యాక్సిన్ తీసుకుని వెళ్లి ఇంటింటికి వెళ్లి ఇవ్వనున్నారు. ఇలా అన్ని కాలనీలు, బస్తీలలలో వంద శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత కాలనీలు, బస్తీల్లో జీహెచ్ ఎంసి అధికారులు ఒక ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్కు సహకరించిన బస్తీ, కాలనీ సంఘాల ప్రతినిధులకు సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు సీఎస్ వివరించారు. ప్రభుత్వం ప్రారంభించనున్న స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ నగర ప్రజలకు సూచించారు.