కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2021-11-12T01:08:57+05:30 IST
భారత్కు 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న నటి
హైదరాబాద్: భారత్కు 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె అని ఆయన ఆరోపించారు. కంగనాకి పద్మశ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంపై మాట్లాడే అర్హత కంగనా రనౌత్ సహా బీజేపీ, ఆర్ఎస్ఎస్కి కూడా లేదని నారాయణ పేర్కొన్నారు.
‘‘1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’’ అంటూ మోదీ ప్రధాని అవ్వటాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఓ కామెంట్ చేసిన విషయం తెలిసిదే. అయితే, నరేంద్ర మోదీని కంగనా ఇలా పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ కావటం సొషల్ మీడియాలో చర్చగా మారింది. ‘‘మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు, ఇక ఇప్పడు... మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని సైతం చులకన చేయటం! దీన్ని ఏమనాలి... పిచ్చా? లేక దేశ ద్రోహమా?’’ అంటూ ట్విట్టర్లో కంగనాని విమర్శించారు వరుణ్ గాంధీ.