నిబద్ధత, కష్టించే తత్వం ఉంటేనే గెలుపు

ABN , First Publish Date - 2021-10-20T05:06:50+05:30 IST

నిబద్ధత, కష్టించే తత్వం ఉంటేనే గెలుపు

నిబద్ధత, కష్టించే తత్వం ఉంటేనే గెలుపు
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ తరుణ్‌జోషి

 పోటీ పరీక్షార్థులు కొన్నిరోజులు సెల్‌ఫోన్లు పక్కన పెట్టాలి

 పోలీసు కమిషనర్‌  తరుణ్‌జోషి

హనుమకొండ క్రైం, అక్టోబర్‌ 19: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే నిబద్ధత, కష్టించే తత్వం ఉండాలని, అప్పుడే తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారని వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, లాల్‌బహదూర్‌ కళాశాల ఆడిటోరియంలలో సీపీ తరుణ్‌జోషి మంగళవారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ, యువకులు పోటీలపరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కొద్ది రోజులపాటు సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టాలని, అప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారన్నారు. హనుమకొండ డివిజన్‌ పరిధిలో 250 మంది అభ్యర్థులకు 80 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. పోటీ పరీక్షల సిలబ్‌సతో పాటు నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తామన్నారు. యువత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షణాసమయంలో కఠోర సాధన చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదవలన్నారు. శిక్షణ సమయంలో సిలబ్‌సపై ఎలాంటి అనుమానాలున్నా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌, సీఐలు రాఽఘవేందర్‌, వేణుమాధవ్‌, జనార్దన్‌రెడ్డి, గణేశ్‌, సతీష్‌, పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జగదీశ్వర్‌తో పాటు పోలీసు సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.

సీపీ ఆలోచన

సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల నియామక పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతీ, యువకులు విజయం సాధించాలనే తలంపుతో సీపీ ఈ శిబిరాల నిర్వహణకు అంకురార్పణ చేశారు. మొదట ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి అర్హత పరీక్ష నిర్వహించారు. అందులో ప్రతిభ చూపిన వారిని శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. శిక్షణ కోసం వచ్చే అభ్యర్థులకు డివిజన్‌ల వారిగా ఉచిత భోజన, వసతితో పాటు శిక్షణ ఇస్తున్నారు.    

Updated Date - 2021-10-20T05:06:50+05:30 IST