తొలిరోజు 10మందికి వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-03-02T05:18:20+05:30 IST
తొలిరోజు 10మందికి వ్యాక్సిన్
ములుగు, మార్చి 1 : రెండోవిడత కొవిడ్ వ్యాక్సినేషన్ జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. ములుగు ఏరియా వైద్యశాలలో టీకా కేంద్రం ఏర్పాటు చేయగా, తొలిరోజు కేవలం 10 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ప్రారంభించి, మాట్లాడారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు పోర్టల్లో నమోదు చేసుకోలేకపోయినా నేరుగా ఏదైనా గుర్తింపు కార్డుతో ఆస్పత్రికి వస్తే టీకా వేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్ తెలిపారు. మరో మూడు రోజులపాటు ములుగు ఏరియా వైద్యశాలలో ఈ ఉచిత టీకా కేంద్రం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రెండోవిడత టీకాకు స్పందన కరువు
చిట్యాల/రేగొండ : కరోనా వైర్సకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సోమవారం రెండోవిడత ఉచిత వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలోని సామాజిక ఆస్పత్రిలో ఏర్పా టు చేసిన కేంద్రానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. చిట్యాల, నవాబుపేట గ్రామాలకు చెందిన రాయిన రాధమ్మ, నేరెళ్ల సారయ్య, బొమ్మ శివలింగం మాత్రమే వాక్సినేషన్ తీసుకున్నారు. వైద్యసిబ్బంది సాయంత్రం వరకు ఎదురుచూసినా ఎవరు రాలేదు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేయబడుతుందని రేగొండ మండల వైద్యాధికారి మమతాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.