రెండో రోజు టీకా జోరు
ABN , First Publish Date - 2021-01-19T04:31:31+05:30 IST
రెండో రోజు టీకా జోరు
విజయవంతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ఉమ్మడి జిల్లాలో 2,036 మందికి టీకాలు
కొత్తగా 25 సెంటర్లు ప్రారంభం
ముగ్గురు హెల్త్ వర్కర్లకు స్వల్ప అస్వస్థత
హన్మకొండ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్-వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజు సోమవారం విజయవంతంగా జరిగింది. కొత్తగా 25 వ్యాక్సిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,450 మందికి వ్యాక్సిన్లు వేయాల్సి ఉండగా 2036 మందికి వేశారు. 414 మంది తీసుకోలేదు. తొలి రోజు ప్రతీ సెంటర్లో 30 మందికి చొప్పున టీకా వేయగా సోమవారం 50 మందికి చొప్పున వేశారు. మూడు చోట్ల వ్యాక్సిన్లు తీసుకున్న ముగ్గురు హెల్త్వర్కర్లు స్వల్ప అస్వస్థతకు గురై కాసేపయ్యాక కోలుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 950 మందికి గాను 814 మంది టీకాలు తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 400 మందికి 372, వరంగల్ రూరల్ జిల్లాలో 350 మందికి 273, జనగామ జిల్లాలో 250 మందికి 250 మంది, ములుగు జిల్లాలో 250 మందికి 154, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 250 మందికి 173 మంది టీకాలు వేయించుకున్నారు.
కాగా, పాలకుర్తి పీహెచ్సీలో వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్వర్కర్ చెన్నూరు విజయలక్ష్మి కళ్లు తిరిగి పడిపోయింది. వ్యాక్సిన్కు ముందు అల్పాహారం ఏమీ తీసుకోకుండా వచ్చినందు వల్ల ఇలా జరిగిందని డాక్లర్లు చెప్పారు. ఆమెను వెంటనే 108లో జనగామ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పీహెచ్సీలో ఇద్దరు ఆశా వర్కర్లు కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కళ్లు తిరుగుతున్నట్టు చెప్పారు. వారిని గం టపాటు అబ్సర్వేషన్లో ఉంచారు. సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పంపించారు. మిగతా చోట్ల ఎక్కడా ఎ లాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ప్రారంభించారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారులు, ఆరోగ్య సిబ్బంది ఉత్సాహంగా ముందుకొచ్చారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం మరో 8 కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆరుచోట్ల ఏర్పాటయ్యాయి. మంగళవారం 13చోట్ల కొత్త వ్యాక్సిన్ సెంటర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. దీంతో మొత్తం సెంటర్ల సంఖ్య 27కు చేరుకుంటుంది. సోమవారం 950 మందికి టీకాలు వే యాల్సి ఉండగా 814 మంది వేసుకున్నారు. రూరల్ జిల్లాలో కొత్తగా నాలుగు వ్యాక్సిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నాలుగు కేంద్రాలు ప్రారంభం కాగా వీటితో కలుపుకొని మొత్తం సెంటర్ల సంఖ్య ఏడుకు పెరిగింది. 350 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 273 మంది తీసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో తొలిరోజు మూడు సెంటర్లు మహబూబాబాద్, కంబాలపల్లి, తొర్రూరు ప్రారంభం కాగా సోమవారం మరిపెడ, దంతాలపల్లి, బయ్యారం, విలేజ్ కేసముద్రం సెంటర్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 400 మందికి గాను 372 మంది టీకాలు వేయించుకున్నారు. జనగామ జిల్లాలో కొత్తగా మూడు సెంటర్లు తెరుచుకున్నాయి. తొలి రోజు జనగామ, పాలకుర్తిలలో సెంటర్లు ప్రారంభమవగా కొత్తగా స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, లింగాలఘణపురంలో ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ సెంటర్ల సంఖ్య ఐదుకు చేరింది. వీటిలో 200 మందికిగాను మొత్తం 200 మంది టీకాలు వేయించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం మరో రెండు వ్యాక్సిన్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రేగొండ, కాటారం వీటిలో ఉన్నాయి. తొలిరోజు భూపాలపల్లి చిట్యాల, మహదేవ్పూర్లో ప్రారంభమయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం ఐదు సెంటర్లలో 250 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 173 మందికి వేశారు. ములుగు జిల్లాలో సోమవారం ఎదరి, వాజేడు, వెంకటాపూర్ పీహెచ్సీల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించారు. తొలి రోజు ఏర్పాటయిన ములుగు, ఏటూరునాగారంలోని సీహెచ్లను కలుపుకొని మొత్తం ఐదు సెంటర్లలో 250 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 154 మందికి వేశారు.