గల్ఫ్ దేశాల్లో కరోనా విజృంభణ
ABN , First Publish Date - 2021-12-30T07:38:24+05:30 IST
కరోనా ఉధృతి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు క్రమంగా కొవిడ్ ఆంక్షలను

- పెరుగుతున్న కేసులు..
- ఆందోళనలో ప్రవాసీయులు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా ఉధృతి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు క్రమంగా కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్న గల్ఫ్ దేశాలు, బూస్టర్ (మూడో) డోసును తప్పనిసరి చేశాయి. బూస్టర్ తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడాన్ని నిషేధించాయి. గత 24 గంటల్లో 2,234 కొవిడ్ కేసులు నమోదైనట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది.
డిసెంబరు మొదటివారం వరకు 50కి మించని రోజువారీ కేసులు, ఇప్పుడు వేలకు చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం దుబాయ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కు లేకుండా బయటకు వస్తే 3వేల దిర్హాంలు (దాదాపు రూ.61వేలు) జరిమానా విధిస్తామని దుబాయ్ పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం వేడుకలను పర్యవేక్షించడానికి దుబాయ్ నగరవ్యాప్తంగా 10వేల కెమెరాలను ఏర్పాటు చేశారు. డిసెంబరు 30 నుంచి దేశ ప్రజలంతా భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించాలని సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. విద్యాసంస్థల రెండో సెమిస్టర్ పరీక్షలను మళ్లీ ఆన్లైన్లో నిర్వహిస్తామని దుబాయ్, అబుధాబి, షార్జా, కువైత్లు ప్రకటించాయి. కువైత్, ఖతర్ దేశాలు తమ దేశ ఆరోగ్య సిబ్బందికి సెలవులను నిలిపివేశాయి.
గత రెండు,మూడు రోజులుగా గల్ఫ్ దేశాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రవాసీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు అనేక మంది భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు తిరిగి వస్తుండగా.. మరోవైపు కొందరు వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ గల్ఫ్ నుంచి ఇండియాకు తిరిగి వెళ్లాలా ? వద్దా ? అనే మీమాంసలో పడ్డారు.