వంట నూనె ధరలపై చర్యలు తీసుకోండి:కేంద్రం
ABN , First Publish Date - 2021-10-25T08:19:43+05:30 IST
వంటనూనెల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే

న్యూఢిల్లీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): వంటనూనెల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే మరోసారి లేఖ రాశారు. పండగల సీజన్ నేపథ్యంలో నూనెలకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే తాము వంట నూనెల ధరలు, లభ్యతను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా డిమాండ్, వినియోగం ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు స్టాక్ నిల్వపై విధించిన పరిమితిని పరిశీలించి రిఫైనర్లు, మిల్లర్లు, హోల్సేల్లర్లు వంటివారు నిల్వ సామర్థ్యం రెండు నెలలకు మించి అదనంగా నిల్వ చేసుకోకుండా చూడాలని స్పష్టం చేశారు.
గతంలో విధించిన స్టాక్ పరిమితిని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2008-2018 మధ్యకాలంలో వంట నూనెల స్టాక్ పరిమితిని రిటైర్లకు 30 నుంచి 300 క్వింటాళ్లు, హోల్సేలర్లకు 370 నుంచి 900 క్వింటాళ్లు, తెలంగాణలో రిటైర్లకు 30 నుంచి 100 క్వింటాళ్లు, హోల్సేలర్లకు 375 నుంచి 5,500 క్వింటాళ్లు విధించిన విషయాన్ని గుర్తు చేశారు.