రేపటి నుంచి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
ABN , First Publish Date - 2021-12-08T09:44:06+05:30 IST
బూత్ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనుంది.
![రేపటి నుంచి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- మార్చి 31 వరకు కొనసాగనున్న కార్యక్రమం
- క్షేత్రస్థాయిలో డిజిటల్ సభ్యత్వాల నమోదు
- కొడంగల్లో ప్రారంభించనున్న రేవంత్రెడ్డి
హైదరాబాద్: బూత్ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనుంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబరు 9న ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొడంగల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలు తమకు ఓటు హక్కు ఉన్న ప్రాంతాల్లో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాధారణంగా మాన్యువల్గా జరిగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ సారి డిజిటల్ పద్ధతిలో జరగనుంది. గతంలో పార్టీ నాయకులు ఎవరడిగితే వారికి సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చేవారు. ఇప్పుడు సభ్యునిగా చేరిన ప్రతీ వ్యక్తి ఏఐసీసీ, టీపీసీసీలకు కనెక్ట్ అయి ఉండేలా డిజిటల్ వ్యవస్థను పార్టీ రూపొందించింది. ప్రతి బూత్కు ఒక ఎన్రోలర్ను నియమించి వారి ద్వారా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది. ఏఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఆయా సభ్యుల ఫోన్ నెంబర్లు, డేటా ఉంటాయి. దీంతో ఏఐసీసీ, టీపీసీసీ చేపట్టే కార్యక్రమాల సమాచారం ఆయా సభ్యులకు యాప్ ద్వారా నేరుగా అందుతుంది. కాగా, డిజిటల్ సభ్యత్వ విధానాన్ని పైలెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ అమలు చేస్తోంది.