మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2021-05-03T03:07:27+05:30 IST

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

హైదరాబాద్: రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి, డాక్యుమెంటేషన్‌పై ఎన్.ఐ.ఆర్.డి.పి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్‌లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఉన్న సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్‌కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఈ ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో శిక్షణా తరగతులు జరగడం ఇదే తొలిసారని ఆకాంక్ష అన్నారు.


ఈ సందర్భంగా ఆకాంక్ష మాట్లాడుతూ ‘‘రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్‌పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం, మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్ జర్నలిజాన్ని గ్రామాల్లో అప్లై చేయడం ఎలా, మొబైల్ జర్నలిజానికి ఉపయోగపడే అధునాతనమైన యాప్స్ ఏమున్నాయి, వాటికి ఉపయోగపడే పరికరాలు ఎక్కడ లభిస్తాయి, వాటిని ఎలా సేకరించుకోవాలి? ఇలా అనేక రంగాల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు మేము ప్రయత్నించాం’’ అని చెప్పారు.


ఆన్‌లైన్ క్లాసులకు 450 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో జర్నలిజం చదివిన, ఇప్పటికే ఈ రంగంలో ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న 179 మందిని తాము ఎంపిక చేశామని అయితే 18 రాష్ట్రాల నుంచి 26 మంది జర్నలిస్టులు ఈ క్లాసులకు హాజరయ్యారని ఆకాంక్ష చెప్పారు. ఈ 26 మంది ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత మందికి శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామసీమల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ శిక్షణ తరగతులు ఈ విధంగా విజయవంతం కావడానికి డాక్టర్ నరేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. దీనికి కోఆర్డినేటర్‌గా డాక్టర్ వెంకటమల్లు తాడబోయిన వ్యవహరించినట్లు ఆకాంక్ష చెప్పారు. అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళడానికి ప్రధాన మీడియా సంస్థల తోడ్పాటు తమకు ఎంతో అవసరం అన్నారు.

Updated Date - 2021-05-03T03:07:27+05:30 IST