కోచ్ఫ్యాక్టరీ ఉద్యమం ఢిల్లీని కదిలించాలి..
ABN , First Publish Date - 2021-03-01T04:59:41+05:30 IST
కోచ్ఫ్యాక్టరీ ఉద్యమం ఢిల్లీని కదిలించాలి..
నినదించిన వివిధ పార్టీల నేతలు
కాజీపేట, ఫిబ్రవరి 28 : కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, రైల్వే డివిజన్ ఏర్పాటు, టౌన్స్టేషన్ను ట్రయాంగిల్ స్టేషన్గా ఉన్నతీకరించేందుకు చేసే ఉద్యమం ఢిల్లీకి తాకితేనే అవి సాధ్యం అవుతాయని అన్నీ పార్టీల నాయకులు నినదించారు. కాజీపేట రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ సాధన, రైల్వే డివిజన్ ఏర్పాటు, ట్రయాంగిల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు అబుబక్కర్, తొట్ల రాజుయాదవ్, కో-ఆప్షన్ సభ్యురాలు కోల వినోద, మాజీ కార్పొరేటర్లు సుంచు అశోక్, తండమళ్ల వేణు రేవతి, స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడారు. కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ నిర్మిస్తే వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వీటి సాధనకోసం తెలంగాణ రైల్వే జేఏసీ చేపట్టబోయే ఆందోళనలో కాజీపేటకు చెందిన అన్ని పార్టీలు కలిసివస్తాయని హామీ ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ కోండ్ర నర్సింగరావు, పసునూరి మనోహర్, మేకల ఉపేందర్తోపాటు, ప్రజాసంఘాల నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.