ధాన్యం కొనుగోళ్లకు తగ్గట్టుగా చెల్లింపులు
ABN , First Publish Date - 2021-05-21T09:32:19+05:30 IST
ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు చెల్లింపులు జరపాలని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు చెల్లింపులు జరపాలని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లకు నిధుల కొరత లేకున్నా... క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందన్న ఫిర్యాదులపై ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిపారు. గురువారం పౌర సరఫరాల భవన్లో ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. మూడు రోజుల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ రూ.28 కోట్లను విడుదల చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన గన్నీ సంచుల ధరను కూడా ఒక్కోటి రూ.18 నుండి రూ.21కి పెంచినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గన్నీ సంచిని రేషన్ డీలర్లు విధిగా పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.