వాక్సిన్ సరఫరాలో కేంద్రం విఫలం: సీపీఐ
ABN , First Publish Date - 2021-05-05T08:39:45+05:30 IST
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారందరూ కరోనాకు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రకటించిన కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడంలో విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారందరూ కరోనాకు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రకటించిన కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేయడంలో విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని సుప్రీంకోర్టు, హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నా స్పందన లేకపోవడం దుర్మార్గమన్నారు. దాదాపు 17 మాసాలుగా దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడుస్తున్నా నియంత్రణ కోసం ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి : సీపీఎం
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా సృష్టిస్తున్న కల్లోలాన్ని కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వదిలి ఉన్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని ఏర్పా టు చేసి తగిన చర్యలు ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శులతో మంగళవారం జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.