జీడిపప్పు ముసుగులో గంజాయి రవాణా
ABN , First Publish Date - 2021-06-22T08:48:56+05:30 IST
జీడిపప్పు ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు.
రెండు టన్నులు స్వాధీనం.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): జీడిపప్పు ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బెంగళూరు జోనల్ ఎన్సీబీ అధికారులు హైదరాబాద్ సబ్ జోనల్ యూనిట్ అధికారులతో కలిసి పెద్దఅంబర్పేట్ టోల్ప్లాజావద్ద ఆదివారం తనిఖీలు చేపట్టారు. జీడిపప్పు ప్యాకెట్ల మధ్యలో గంజాయి ప్యాకెట్లు ఉంచి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. 1080 జీడిపప్పు ప్యాకెట్ల మధ్యలో ప్యాక్ చేసిన గంజాయి రెండు టన్నులకుపైగా ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్ర-ఒడిసా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబై, పుణెలో సరుకు అందజేస్తుంటారని ప్రాథమిక విచారణలో తేలింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన కె.కాలే, ఎస్.కాలే, సి.కాలే, డి.ధోరల్కర్ను అరెస్ట్ చేసి వాహనం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని ఎన్సీబీ అధికారులు హెచ్చరించారు.