కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-12-30T18:22:01+05:30 IST
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో 65కిలోల ఎండు గంజాయిని బుధవారం వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని..
![కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి పట్టివేత](https://media.andhrajyothy.com/appimg/galleries/192112301218738/12302021155302n78.jpg)
65కిలోలు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
గిర్మాజిపేట, డిసెంబరు 29: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో 65కిలోల ఎండు గంజాయిని బుధవారం వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు వివరాలను జీఆర్పీ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ జి.నరేష్ వెల్లడించారు. బుధవారం వరంగల్ జీఆర్పీ ఎస్సై పరశురామ్ ఆధ్వర్యంలో హెడ్కానిస్టేబుల్ కె.సురేష్, కానిస్టేబుళ్లు జె.అనిల్, కె.భాస్కర్, బి.రమేష్, ఎస్.అనిల్తో కూడిన బృందం వరంగల్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టింది. రెండో ప్లాట్ఫామ్పై తనిఖీచేస్తున్న సమయంలో భువనేశ్వర్-ముంబయి కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు అదే ప్లాట్ఫామ్పైకి వచ్చింది. జీఆర్పీ సిబ్బంది రైలులోని ఏసీ బోగీలను తనిఖీ చేస్తుండగా ట్రాలీ సూట్కేసులు, షోల్డర్ బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వరంగల్ జీఆర్పీకి తరలించి విచారించి ట్రాలీ సూట్కేసులు, బ్యాగులను చూడగా 65కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సలీం(25), ఒడిశాకు చెందిన పూర్ణఖోస్ల(22)లను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయితో పాటు సలీం, పూర్ణఖోస్లలను కాజిపేట రైల్వేకోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ నరేష్ తెలిపారు.
ఈ గంజాయి విలువ రూ.6.50లక్షలు ఉంటుందని తెలిపారు. పూర్ణఖోస్ల, సలీంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం, విశాఖపట్టణంలో గంజాయిని కొనుగోలు చేసి కోణార్స్ ఎక్స్ప్రె్సలో ముంబయికి తరలిస్తున్నారని సీఐ తెలిపారు. సమావేశంలో జీఆర్పీ కాజీపేట సీఐ రామ్మూర్తి, వరంగల్ ఎస్సై పరశురామ్ పాల్గొన్నారు.