అధికారంలో ఉండి పాదయాత్రలా...?: శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2021-08-28T23:37:02+05:30 IST
ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు.
మహబూబ్నగర్: ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉన్నదని తప్పుబట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని అధికారంలోకి రాక ముందు కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. లాభాలలో ఉన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పడానికి పాదయాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లున్నాయని, బీజేపీ నేతలు ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి డజన్ మంది కేంద్ర మంత్రులు ప్రశంసించారని శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు.