హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే ‘బీసీ బంధు’ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-08-25T08:05:13+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే ‘బీసీ బంధు’ పథకం ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికీ రూ.పది లక్షలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

- బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్
- ధర్నా చౌక్లో ధర్మ పోరాట దీక్ష.. అన్ని పార్టీల మద్దతు
కవాడిగూడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే ‘బీసీ బంధు’ పథకం ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికీ రూ.పది లక్షలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దీనిపై తక్షణమే స్పందించాలని, లేకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్లి టీఆర్ఎ్సను ఓడిస్తామని హెచ్చరించారు.
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాచౌక్ వద్ద బీసీల ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ దేశం మొత్తంలో తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని సీఎం కేసీఆర్ గొప్పగా ప్రకటించారని, వెంటనే బీసీ బంధు పథకం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ధ్వజమెత్తారు. దళిత బంధును తాము స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలు లేకపోవడం వల్లే వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, బీసీలంతా ప్రభుత్వంపై తిరగబడాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్కుమార్ అన్నారు.