బండి సంజయ్ కాదు తొండి సంజయ్: కేటీఆర్
ABN , First Publish Date - 2021-11-12T20:07:47+05:30 IST
రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి
సిరిసిల్ల: ‘‘బీజేపీ నేత బండి సంజయ్ కాదు తొండి సంజయ్. యాసంగిలో వరే వేయండి అంటున్న తొండి సంజయ్. బండి సంజయ్ను గెలిపించినోళ్లకి ఓ దండం. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్కి పంపించారు. హిందూ-ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పని’’ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కారని తెలిపారు. ఏడు దశాబ్దాల వెనుకబాటును ఏడాదిలో సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు. ఏడేళ్ల వరుస కరవు నుంచి ఏడేళ్లలో అభివృద్ధిబాటలో నిడిపించారని కేటీఆర్ తెలిపారు.
చిన్ననీటి వనరుల రూపురేఖలు సీఎం మార్చారని ప్రశంసించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో చెరువులు తెగకుండా చూసుకున్నామన్నారు. 3 కోట్ల ఆహారధాన్యాలను తెలంగాణ పండిస్తున్నదని తెలిపారు. అన్నీ అమ్మటమే ప్రధాని మోదీ ఆలోచన అని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని పేర్కొన్నారు. డెల్టాలో కనిపించే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయన్నారు. ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశాలలో ముందంజలో భారత్ ఉందని తెలిపారు. గత 75 ఏళ్లలో దేశాన్ని ఎలా నడిపించారో బీజేపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.