అన్ని వర్గాల నిరుపేదలకు 10 లక్షలివ్వాలి
ABN , First Publish Date - 2021-07-25T08:09:20+05:30 IST
దళితులకే కాదు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకూ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు...
- హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయం: బండి సంజయ్
ఇల్లందకుంట, జూలై 24: దళితులకే కాదు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకూ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర సందర్భంగా శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పాయన్నారు. ఏ ఎన్నికలైనా హామీలిచ్చి విస్మరించడం కేసీఆర్కు అలవాటయిపోయిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్లో వరద బాధితుల్లో కొద్దిమందికి రూ.10 వేల చొప్పున ఇచ్చి.. ఎన్నికలయ్యాక సాయాన్ని ఆపేశారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు దుబాయిలో పెట్టుబడులు పెడుతున్నారని, వాటిని బయటకు తీస్తామన్నారు.