కేటీఆర్‌పై పార్టీలోనే వ్యతిరేకత

ABN , First Publish Date - 2021-01-23T04:28:04+05:30 IST

కేటీఆర్‌పై పార్టీలోనే వ్యతిరేకత

కేటీఆర్‌పై పార్టీలోనే వ్యతిరేకత
హన్మకొండ హరిత్‌ హోటల్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఆయనను సీఎం చేస్తే టీఆర్‌ఎ్‌సలో విస్ఫోటం జరుగుతుంది..

బీజేపీ ఒత్తిడితోనే అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


మట్టెవాడ/కాళోజీ జంక్షన్‌, జనవరి 22: కేటీఆర్‌ను సీఎం చేస్తే టీఆర్‌ఎ్‌సలో అణు విస్ఫోటం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.  కేటీఆర్‌ సీఎం కావడం మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఇష్టం లేదన్నారు. వారి అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం మార్పు జరిగితే పార్టీలో సంక్షోభం తప్పదని హెచ్చరించారు.  చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తల్లి భాగ్యమ్మ దశదిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు శుక్రవారం  సంజయ్‌ నగరానికి వచ్చారు. హన్మకొండ నయీంనగర్‌లో శోభను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు  పదిశాతం రిజర్వేషన్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులసంఘాలు సంజయ్‌ని ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్‌ నాటకాలు అడుతున్నారని విమర్శించారు. ఇంకా దాచుకోవడానికి, దోచుకోవడానికి దోష నివారణ పూజలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పూజలు చేసింది ఇందులో భాగమేనని  అన్నారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయంగా జరిగిన పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠ దిగజారిందన్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు కేసీఆర్‌ రోజుకో కొత్త నాటకానికి తెర లేపుతున్నాడన్నారు. బీజేపీతో కలిసి ఉన్నట్టు భ్రమలు కల్పిస్తున్నాడన్నారు. తెలివి ఉన్నవారెవరూ టీఆర్‌ఎ్‌సతో పొత్తుపెట్టుకోరని సంజయ్‌ వ్యాఖ్యానించారు. దమ్ముంటే పొత్తులపై చర్చకు కేసీఆర్‌ ఢిల్లీకి రావాలని సవాల్‌ విసిరారు. 

రెండేళ్లకైనా స్పందించి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం అంగీకరించడం స్వాగతిస్తున్నామని సంజయ్‌ అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా కేసీఆర్‌ ఇంతకాలం నానపెట్టారని విమర్శించారు.  బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు కేసీఆర్‌ దిగివచ్చాడని అన్నారు. రిజర్వేషన్లు అమలుకాక అప్పులు ఇచ్చే షావుకారులు అప్పులపాలయ్యారని, బ్రాహ్మణులు అడుక్కుతినే పరిస్థితి వచ్చిందన్నారు. రిజర్వేషన్ల అమలులో జాప్యానికి పాల్పడినందుకు సీఎం కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.  

ఉద్యోగులకు పీఆర్‌సీ అమలులోనూ కేసీఆర్‌ కావాలని కాలయాపన చేస్తున్నారని సంజయ్‌ విమర్శించారు. సత్వరం అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రగతిభవన్‌కు పోవాలంటే  ఇతరులకు పాస్‌పోర్టు కావాలని, ఓవైసీకి మాత్రం గ్రీన్‌కార్డు ఉంటుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న స్టాఫ్‌నర్సులపై పోలీసులు లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. ఆందోళనలను పోలీసులతో అణచివేయడం కేసీఆర్‌కు పరిపాటైందని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్‌, రత్నం సతీ్‌షషా, చాడా శ్రీనివా్‌సరెడ్డి, ఎడ్ల ఆశోక్‌ రెడ్డి, డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతో్‌షరెడ్డి, దేషిని సదానందం గౌడ్‌, బాకం హరిశంకర్‌, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా  పదాధికారులు, మోర్చాల జిల్లా అధ్యక్షులు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంజయ్‌ మోటార్‌సైకిల్‌పై అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని  ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

Updated Date - 2021-01-23T04:28:04+05:30 IST