కల్తీ కల్లుకు మరొకరి బలి
ABN , First Publish Date - 2021-01-12T08:35:13+05:30 IST
వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లుకు మరొకరు బలయ్యారు. అస్వస్థతకు గురైన.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య (90) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు

చికిత్స పొందుతూ 90 ఏళ్ల వృద్ధుడి మృతి
వికారాబాద్ జిల్లాలో రెండుకు పెరిగిన సంఖ్య
సోమవారం ఆస్పత్రిలో చేరిన 11 మంది.. 143 మంది డిశ్చార్జి
వికారాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లుకు మరొకరు బలయ్యారు. అస్వస్థతకు గురైన.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య (90) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. శనివారం వికారాబాద్ మండలం పెండ్లిమడుగు వాసి కృష్ణారెడ్డి చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం నవాబుపేట మండలంలో 17 మంది, వికారాబాద్ మండలంలో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది ఆస్పత్రుల్లో చేరారు. దీంతో బాధితుల సంఖ్య 324కు చేరింది. ఆస్పత్రుల్ల్లో చేరిన 171 మందిలో చికిత్స అనంతరం 149మంది డిశ్చార్జి అయ్యారు. వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 18 మంది, రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కొక్కరు, ఉస్మానియాలో ఇద్దరు చొప్పున ఉన్నారు. బాధితులను జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పరామర్శించారు. కల్తీ కల్లు తాగి కొందరు, అది లభించక మరికొందరు అస్వస్థతకు గుయ్యారని మోతీలాల్ చెప్పారు. నవాబుపేట, వికారాబాద్ మండలాల్లో పరిస్థితి కుదుటపడుతోంది. మరోవైపు బాధితుల్లో విత్డ్రాయల్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.యాదయ్య చెప్పారు. రసాయనాలతో తయారుచేసే కృత్రిమ కల్లు తాగేవారికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని..వారి విపరీత ప్రవర్తనకు కారణం ల్యాబ్ రిపోర్టులు వస్తేగాని తెలియదన్నారు.