15 రోజుల్లో పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-01-21T04:15:40+05:30 IST
15 రోజుల్లో పనులు పూర్తిచేయాలి

అధికారుల పనితీరుపై అదనపు కలెక్టర్ ఆగ్రహం
వెంకటాపురం(నూగూరు), జనవరి 20: మండల అధికారుల పనితీరుపై అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంతో నత్తనడకన జరుగుతున్నాయని ఆగ్రహించారు. వెంకటాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, సర్పంచ్లతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికల పనుల వివరాలను తెలుసుకున్నారు. రైతు కల్లాల విషయమై అడిగారు. మరుగుదొడ్ల నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేయాలని, ఉపాధి హామీలో కూలీలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. సమీక్షకు హాజరుకాని అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం వెంకటాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కరోనా వ్యాక్సినేషన్ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.