ఏసీబీ వలలో ఈజీఎస్ ఉద్యోగి
ABN , First Publish Date - 2021-12-15T05:40:25+05:30 IST
ఏసీబీ వలలో ఈజీఎస్ ఉద్యోగి

రైతు నుంచి రూ. 10వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ధర్మసాగర్, డిసెంబరు 14: రైతు నుంచి రూ.10వేల లంచం తీసుకుంటూ ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ బటెక్నికల్ అసిస్టెంట్గా అందె యాదగిరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా మంగళవారం పట్టుకున్నారు. వరంగల్ రేంజ్ ఏసీపీ డీఎస్పీ ఎ.మధుసూదన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన మజ్జిక రాజయ్య అనే రైతు మునగ తోట పెంపకానికి గత జూన్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరు కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ పరంగా రైతుకు మునగ తోట మంజూరైంది. అధికారులు మునగ మొక్కలను పంపిణీ చేయగా మూడెకరాల వ్యవసాయ భూమిలో రైతు మొక్కలను నాటాడు.
నాటిన మునగ తోటను ఎంక్వైరీ చేసేందుకు టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి రఘు ఇద్దరు కలిసి తోట వద్దకు వెళ్లారు. నాటిన మొక్కలకు మెయింటనెన్స్ బిల్లు ప్రాసెస్ కోసం టెక్నికల్ అసిస్టెంట్... రైతు రాజయ్యను రూ.15వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బిల్లుల కోసం రైతు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతు కుమారుడు లింగం ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఈ క్రమంలో రైతు కుమారుడు మంగళవారం ధర్మసాగర్ బస్టాండ్లోని హోటల్లో కలిసి, టెక్నికల్ అసిస్టెంట్కు రూ. 10వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యాదగిరిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రూ.10వేల నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.