పదకొండేళ్లకు ఇంటికి చేరిన మహిళ

ABN , First Publish Date - 2021-08-25T08:49:46+05:30 IST

మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ, మళ్లీ 11 ఏళ్లకు తన ఇంటికి చేరిన ఘటన ఇది.

పదకొండేళ్లకు ఇంటికి చేరిన మహిళ

మతిస్థిమితం కోల్పోయి చెన్నైకి..చికిత్స అనంతరం తిరిగి వచ్చిన జ్ఞాపకాలు

మెట్‌పల్లి రూరల్‌, ఆగస్టు, 24: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ, మళ్లీ 11 ఏళ్లకు తన ఇంటికి చేరిన ఘటన ఇది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన రెంజర్ల నర్సయ్య 11 ఏళ్ల క్రితం జీవనోపాధికై దుబాయ్‌ వెళ్లాడు. అతడి భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లతో కలిసి గ్రామంలో ఉండేది. అయితే.. అనారోగ్యం కారణంగా మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి, ఆ సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం గాలించే క్రమంలో.. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ శివారులో కుళ్లిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని లక్ష్మిదిగా కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నర్సయ్య మరో వివాహం చేసుకున్నాడు. ఈ కథ ఇలా నడుస్తుండగా.. 2015లో చెన్నైలోని పెరంబూరు జిల్లాలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న లక్ష్మిని అక్కడి కరుణామలై ట్రస్ట్‌ సభ్యులు గుర్తించి చేరదీశారు. ఆమెకు చికిత్స అందించారు. ఆ తర్వాత మామూలు మనిషిగా మారిన లక్ష్మికి తన గతం గుర్తు వచ్చింది. తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ట్రస్టు సభ్యులకు తెలిపింది.


ట్రస్ట్‌ సభ్యులు చెన్నై పోలీసులకు వివరాలను తెలియజేయగా, వారి ద్వారా విషయం మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కరుణామలై ట్రస్టు ఆశ్రయంలో లక్ష్మి ఉందన్న సమాచారాన్ని అందుకున్న నర్సయ్య, కుటుంబ సభ్యులతో కలిసి ట్రస్టుకు వెళ్లి తన భార్యను గుర్తించాడు. ఆమెను తీసుకుని మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో.. 11 ఏళ్ల ఈ కథకు తెరపడింది..

Updated Date - 2021-08-25T08:49:46+05:30 IST