నార్సింగ్ కళాశాలలో 18 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2021-12-30T07:37:24+05:30 IST
నార్సింగ్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ

- విదేశాల నుంచి వచ్చిన పదిమందికి కూడా..
- రాష్ట్రంలో కొత్త కేసులు 235
హైదరాబాద్/నార్సింగ్, శంషాబాద్ రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ రెండోరోజు కరోనా టెస్టులు నిర్వహించారు. మంగళవారం 118 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మరో 93 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివ్ నిర్ధారణ అయిన కళాశాల విద్యార్థుల సంఖ్య 32కు పెరిగింది. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్లో ఉంచగా, మిగతా వారిని ఇళ్లకు పంపించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మునిసిపల్ పరిధిలో ఓ 15 ఏళ్ల బాలుడికి ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అతడు 11రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. బాలుడితో కాంటాక్ట్ అయిన 40మందికి టెస్టులు నిర్వహించగా ముగ్గురికి ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఓ మోడల్ స్కూల్లో నలుగురు విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్గా తేలింది.
ఇక తెలంగాణలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా 200కుపైనే కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 235 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో ఒకరు చనిపోయారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన 346 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో పదిమందికి వచ్చింది. కాగా, హైదరాబాద్లో ఒక్కరోజే 121 కేసులు నమోదయ్యాయి.