కొవిడ్పై పోరుకు విరుష్క విరాళం రూ. 2 కోట్లు
ABN , First Publish Date - 2021-05-08T08:59:36+05:30 IST
కొవిడ్-19పై పోరుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ సై అంది.

చేయూతనివ్వాలని పిలుపు
న్యూఢిల్లీ: కొవిడ్-19పై పోరుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ సై అంది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ. 7 కోట్లు విరాళంగా సేకరించాలని సంకల్పించింది. ఇందుకు తమ వంతుగా రూ. 2 కోట్లను శుక్రవారం ప్రకటించింది. నిధుల సేకరణ ప్లాట్ఫామ్ ‘కెట్టో’ వేదికగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని విరుష్క జోడీ పిలుపునిచ్చింది. ఏడు రోజులపాటు ఈ విరాళాల సేకరణ ఉద్యమం కొనసాగనుంది. ‘దేశ చరిత్రలోనే మనం తొలిసారి అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మనమంతా ఒక్కటై సాధ్యమైనంత ఎక్కువమందిని ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవాలి. ఈ బృహత్కార్యంలో అంతా భాగస్వాములు కావాలి’ అని కోహ్లీ పిలుపునిచ్చాడు.