వైద్య విద్యార్థినికి సచిన్ చేయూత
ABN , First Publish Date - 2021-07-28T09:38:40+05:30 IST
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక పేదింటి మెడిసిన్ విద్యార్థికి అండగా నిలబడి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి పట్టణానికి సమీపంలోని జరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దీప్తికి...
ముంబై: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక పేదింటి మెడిసిన్ విద్యార్థికి అండగా నిలబడి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి పట్టణానికి సమీపంలోని జరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దీప్తికి డాక్టర్ కావాలనేది కల. ఆ గ్రామం నుంచి మెడిసిన్ చదువుతున్న ప్రథమ వ్యక్తి ఆమె కావడం విశేషం. మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా ఉండని మారుమూల ప్రాంతంలో ఉంటున్న దీప్తి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకున్న సచిన్కు చెందిన ఎస్ఎ్సఎఫ్ ఎన్జీఓ దీప్తికి స్కాలర్షిప్ అందిస్తోంది. ప్రస్తుతం అకోలా ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న దీప్తి.. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పింది. దిగ్గజ క్రికెటర్ అందిస్తున్న స్కాలర్షి్పతో తన అవసరాలన్నీ తీరుతున్నాయని తెలిపింది. ఇక, సచిన్ ఎన్జీఓ గత పన్నెండేళ్లలో నాలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 833 మంది విద్యార్థులకు స్కాలర్షి్పలను అందించింది.