విరిసిన క్రీడాపద్మాలు
ABN , First Publish Date - 2021-11-09T06:10:47+05:30 IST
బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు.
![విరిసిన క్రీడాపద్మాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110912230462/11092021004007n11.jpg)
పద్మవిభూషణ్ అందుకున్న మేరీకోమ్, పద్మభూషణ్ స్వీకరించిన పీవీ సింధు
రాణీ రాంపాల్, బెంబెమ్ దేవికి
పద్మశ్రీ ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. గతేడాదికిగాను ప్రకటించిన పద్మ అవార్డుల్లో.. దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్కు మేరీ, మూడో పౌర పురస్కారమైన పద్మ భూషణ్కు సింధు, పద్మశ్రీకి మహిళల హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, మాజీ హాకీ ప్లేయర్ ఎంపీ గణేశ్, మాజీ షూటర్ జీతూ రాయ్, మాజీ ఫుట్బాలర్ ఓనియమ్ బెంబెమ్ దేవి, ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా వాయిదా పడ్డ 2020 అవార్డుల ప్రదానోత్సవాన్ని సోమవారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి సింధు, మేరీకోమ్, రాణీ రాంపాల్, బెంబెమ్ దేవి అవార్డులను స్వీకరించారు.
గర్వంగా ఉంది..
నేనెంతో గర్వపడే క్షణాలివి. అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఇతర మంత్రులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్లో మరింత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు పురస్కారాలు ఎంతో తోడ్పడతాయి.
- పీవీ సింధు