ఐపీఎల్ వేలం వాయిదా!
ABN , First Publish Date - 2021-01-26T08:43:52+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగే మినీ ఆటగాళ్ల వేలం ఓ వారం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న ఈ వేలం జరపాలని ఇంతకుముందు బీసీసీఐ నిర్ణయించింది...
- వచ్చే నెల మూడో వారంలో..
- రూ.200 కోట్లు ఖర్చు చేయనున్న ఫ్రాంచైజీలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగే మినీ ఆటగాళ్ల వేలం ఓ వారం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న ఈ వేలం జరపాలని ఇంతకుముందు బీసీసీఐ నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 18 లేక 19న వేలాన్ని నిర్వహించే చాన్స్ ఉంది. ఈ విషయమై త్వరలోనే ఐపీఎల్ పాలక మండలి తుది షెడ్యూల్ను ప్రకటించనుంది. మరోవైపు ఆటగాళ్ల వేలం జరిగే వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు. ఇందుకోసం చెన్నైని ఎంపిక చేసే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం. అలాగే బీసీసీఐతో ఒప్పందం లేని ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉండాలనుకుంటే.. ఆటగాళ్ల వేలం కాంట్రాక్ట్ను ఫిబ్రవరి 4లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
8 ఫ్రాంచైజీలు.. రూ.196.6 కోట్లు
ఐపీఎల్కు చెందిన 8 జట్లు తమ బృందాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంలో రూ.196.6 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు.. వేలం కోసం విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. మొత్తంగా ఎనిమిది ఫ్రాంచైజీలు 139 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. వీరందరి ధర కలిపితే రూ.483.39 కోట్లుగా ఉండడం విశేషం. అలాగే అన్ని జట్లు కలిపి 57 మంది ఆటగాళ్లను తమ టీమ్స్ నుంచి తొలగించాయి. దీంతో కొత్త ఆటగాళ్ల కోసం రూ.196.6 కోట్లను వేలంలో ఖర్చు చేయబోతున్నాయి. అయితే పంజాబ్ జట్టు మ్యాక్స్వెల్, కాట్రెల్, నీషమ్, ముజీబుర్ తదితర 9 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఎక్కువ మొత్తాన్ని వేలంలో ఖర్చు చేయబోతోంది.
వేలంలో ఉండే టాప్ ఆటగాళ్లు వీరే..: స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, ఆరోన్ ఫించ్, కేదార్ జాదవ్, మురళీ విజయ్, జేసన్ రాయ్, అలెక్స్ కేరీ, కరుణ్ నాయర్, కల్టర్నైల్, వరుణ్ ఆరోన్, మొయిన్ అలీ, మెక్లెనగన్, ఉమేశ్ యాదవ్, శివమ్ దూబే, కృష్ణప్ప గౌతమ్, స్టాన్లేక్, కీమో పాల్లపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించనున్నాయి.