చరిత్రలో ఇదే తొలిసారేమో: టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-05-21T02:25:39+05:30 IST
భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ బలం బాగుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు.

ప్రస్తుతం టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ బలం బాగుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఇలాంటి రిజర్వ్ బెంచ్ 1990, 2000 దశకాల్లోని ఆస్ట్రేలియా జట్టుకు కూడా లేదని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు, ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్ క్రికెట్ పటిష్టంగా ఉందని అన్నాడు.
`కోహ్లి సారథ్యంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంటే.. అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. దీనిని బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఓ దేశం తరఫున రెండు జాతీయ జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చేమోన`ని అన్నాడు.