రెట్టించిన ఉత్సాహంతో..

ABN , First Publish Date - 2021-08-25T06:20:03+05:30 IST

ఐదు టెస్టుల సిరీ్‌సలో ఇప్పటిదాకా భారత జట్టుదే ఆధిపత్యం. తొలి టెస్టులో వరుణుడు అడ్డుపడకుంటే కోహ్లీ సేనకే గెలుపు అవకాశం ఉండేదన్నది విశ్లేషకుల భావన. ఇక లార్డ్స్‌లో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే...

రెట్టించిన ఉత్సాహంతో..

  • ఇంగ్లండ్‌తో భారత్‌ మూడో టెస్టు నేటి నుంచే 
  • మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో


లీడ్స్‌: ఐదు టెస్టుల సిరీ్‌సలో ఇప్పటిదాకా భారత జట్టుదే ఆధిపత్యం. తొలి టెస్టులో వరుణుడు అడ్డుపడకుంటే కోహ్లీ సేనకే గెలుపు అవకాశం ఉండేదన్నది విశ్లేషకుల భావన. ఇక లార్డ్స్‌లో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. టెయిలెండర్ల అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు ఆధిక్యం అందించగా ఆ తర్వాత భారత పేసర్ల పదునెంతో ఇంగ్లండ్‌ చవిచూసింది. రెండు సెషన్లు కూడా పూర్తి చేయకుండానే టీమిండియాకు దాసోహమైంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్టు రసవత్తరంగా జరిగే అవకాశముంది. అయితే ప్రస్తుత భారత జట్టులో ఏ ఒక్కరికీ ఈ హెడింగ్లే మైదానంలో ఆడిన అనుభవం లేదు.


కోహ్లీ ఈసారైనా..: కోహ్లీ ఫామ్‌ జట్టుకు ఆందోళనగా మారింది. ఆధునిక క్రికెట్‌లో తిరుగులేని ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ నుంచి చివరి సెంచరీ 2019 నవంబరులో వచ్చిందంటే నమ్మడం కాస్త కష్టమే. ఈ సిరీ్‌సలో రెండుసార్లు 40లు సాధించినా అతడి నుంచి అభిమానులు ఆశించేది ఇలాంటి స్కోర్లు కాదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్‌స్టం్‌పనకు ఆవలగా వెళుతున్న బంతిని వేటాడే విరాట్‌ అవుటయ్యాడు. ఈ బలహీనతను అతడు అధిగమించాలి. పుజార, రహానె మెరుగైన ఫామ్‌లో లేకపోయినా లార్డ్స్‌లో నాలుగో రోజు కీలక భాగస్వామ్యం అందించారు. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ జట్టుకు శుభారంభాలు అందించడం ప్లస్‌ పాయింట్‌. ఇక వాతావరణాన్ని బట్టి మరోసారి నలుగురు పేసర్లతోనే వెళ్లే చాన్సుంది. అదే జరిగితే స్పిన్నర్‌ అశ్విన్‌కు నిరాశే మిగులుతుంది. శార్దూల్‌ ఫిట్‌గా ఉన్నా పేస్‌ బలగంలో మార్పులుండకపోవచ్చు.




రూట్‌పైనే భారం: స్టోక్స్‌, బ్రాడ్‌ లేక బలహీనంగా మారిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌.. ఇప్పుడు పేసర్‌ మార్క్‌ ఉడ్‌ సేవలను కూడా కోల్పోయింది. గాయంతో అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు. జట్టు ఓపెనర్లు బర్న్ప్‌, సిబ్లే కూడా నిరాశపరుస్తున్నారు. దీంతో సిబ్లే స్థానంలో వన్డే స్పెషలిస్ట్‌ మలాన్‌ను జట్టులోకి తెచ్చారు. అతను మూడో స్థానంలో ఆడనుండగా, హసీబ్‌ హమీద్‌ ఓపెనర్‌గా వస్తున్నాడు. ఎప్పటిలాగే జట్టు కెప్టెన్‌ రూట్‌ బ్యాటింగ్‌పైనే జట్టు భారం వేసింది. బట్లర్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.



జట్లు (అంచనా)


భారత్‌: రాహుల్‌, రోహిత్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌, జడేజా, షమి,  ఇషాంత్‌, బుమ్రా, సిరాజ్‌.

ఇంగ్లండ్‌: బర్న్ప్‌, హమీద్‌, మలాన్‌, రూట్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, బట్లర్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, రాబిన్సన్‌, ఒవర్టన్‌/మహమూద్‌, అండర్సన్‌.

Updated Date - 2021-08-25T06:20:03+05:30 IST