అదే నిజమైతే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్పై కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-12-01T00:07:33+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కోసం త్వరలోనే భారీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కోసం త్వరలోనే భారీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 జట్లు తాము ఉంచుకునే (రిటైన్) ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించేందుకు నేడే ఆఖరు గడువు. ఇక, వచ్చే సీజన్లో లక్నో, అహ్మదాబాద్ జట్లు చేరబోతున్నాయి. ఫలితంగా ఐపీఎల్లో తలపడే జట్ల సంఖ్య 10కి పెరుగుతుంది.
ఆటగాళ్ల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతున్న వేళ పంజాబ్ కింగ్స్ ఆటగాడు కేఎల్ రాహుల్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొత్త ఫ్రాంచైజీ లక్నోను సంప్రదించినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇదే నిజమైతే వీరిద్దరిపైనా చర్యలు తప్పవని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. వీరిద్దరిపై రెండు ఫ్రాంచైజీల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, కాకపోతే మౌఖికంగా మాత్రమే ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని, వీటిని నిరోధించడం కష్టమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే, ఆటగాళ్లు ఇలా సంప్రదించడం మాత్రం సరైనది కాదని అన్నారు.