హైదరాబాద్కు నిరాశే!
ABN , First Publish Date - 2021-03-08T09:28:52+05:30 IST
హైదరాబాద్ క్రికెట్ సంఘంలోని అంతర్గత కుమ్ములాటలు.. బీసీసీఐలోని ఓ వర్గం లాబీయింగ్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ సంఘంలోని అంతర్గత కుమ్ములాటలు.. బీసీసీఐలోని ఓ వర్గం లాబీయింగ్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆతిథ్యానికి హైదరాబాద్ దూరమైంది. హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్లో కోరినా బీసీసీఐ నుంచి స్పందనలేదు. ఐపీఎల్ వేదికలు దాదాపుగా ఖరారయ్యాయని.. అందులో హైదరాబాద్ లేదంటూ పత్రికల్లో కథనాలు వచ్చే వరకు పట్టించుకోని హెచ్సీఏ పెద్దలు నగరంలో మ్యాచ్లు నిర్వహించాలని ఈనెల నాలుగున హడావిడిగా తీర్మానం చేసి బీసీసీఐకి పంపారు. దీన్ని కూడా చెత్త బుట్టలో పడేసిన బీసీసీఐ ఆదివారం ఐపీఎల్ 2021 షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది.
ఆతిథ్య అవకాశాన్ని హెచ్సీఏ కోల్పోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నుంచి లభించే మొత్తంతో పాటు బీసీసీఐ నుంచి వచ్చే ఐపీఎల్ వాటాల్లో కూడా భారీగా కోత పడనుంది. ఆర్థిక నష్టంతో పాటు ఆతిథ్య అవకాశం చేజారడానికి ప్రస్తుత హెచ్సీఏ పాలకవర్గ ఉదాసీన వైఖరే కారణమని పలువురు క్లబ్ కార్యదర్శులు విమర్శిస్తున్నారు. ఇక, మహారాష్ట్రలో.. ముఖ్యంగా ముంబైలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా ఐపీఎల్ వేదికల్లో ఆ నగరం స్థానం దక్కించుకోవడం వెనక బీసీసీఐలోని ముంబై లాబీయింగ్ బలంగా పనిచేసినట్టు తెలుస్తోంది. అనివార్య కారణాలతో ఒకవేళ ప్రస్తుత వేదికల నుంచి ఏదైనా నగరం వైదొలిగితే దాని స్థానంలో హైదరాబాద్కు అవకాశమివ్వాలని తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.