ధోనీ తమిళ ప్రజలలో ఒకడిగా మారిపోయాడు: స్టాలిన్
ABN , First Publish Date - 2021-11-21T01:28:37+05:30 IST
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై తమిళనాడు
చెన్నై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ధోనీ ఝార్ఖండ్ వాడైనా తమిళ ప్రజలలో ఒకడిగా మారిపోయాడని అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, సీఎఎస్కే అభిమాని శ్రీనివాసన్ కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్కు ఐపీఎల్ ట్రోఫీని అందించారు.
అలాగే, ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కూడా సీఎంకు అందించారు. ఆయనకు అందించిన నంబర్ 7 జెర్సీపై ‘ఎంకే స్టాలిన్ అని రాసి ఉండడం గమనార్హం. ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ధోనీ మాట్లాడుతూ.. ఐపీఎల్తో తన చివరి మ్యాచ్ను చెపాక్ మైదానంలో ఆడతానన్నాడు. చెన్నై ప్రజలు ఎంతో మంచివారని, గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ తరపున తన చివరి మ్యాచ్ను అదే మైదానంలో ఆడిన విషయాన్ని ధోనీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
తన చివరి మ్యాచ్ను చెపాక్లో ఆడతానని చెప్పడం ద్వారా వచ్చే ఏడాది ఐపీఎల్కు అందుబాటులో ఉంటానని ధోనీ చెప్పకనే చెప్పాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ ట్రోఫీని వేదికపై ప్రదర్శించారు.