లాక్డౌన్ సమయంలో పుస్తకాన్ని రచించిన ప్రవాసీ బాలిక
ABN , First Publish Date - 2021-03-28T13:42:24+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం లభించింది. మరోపక్క పిల్లలకు స్కూళ్లు లేకపోవడంతో వారు కూడా ఇంట్లోనే తల్లిదండ్రులతో ఆడుకుంటూ గడిపేందుకు సమయం దొరికింది. అయితే లాక్డౌన్ సమయాన్ని చాలా మంది పిల్లలు, పెద్దలు సద్వినియోగం చేసుకున్నారు.
కరీంనగర్: కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం లభించింది. మరోపక్క పిల్లలకు స్కూళ్లు లేకపోవడంతో వారు కూడా ఇంట్లోనే తల్లిదండ్రులతో ఆడుకుంటూ గడిపేందుకు సమయం దొరికింది. అయితే లాక్డౌన్ సమయాన్ని చాలా మంది పిల్లలు, పెద్దలు సద్వినియోగం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన ఓరుగంటి తన్వి(10) అనే బాలిక లాక్డౌన్ సమయంలో ఏకంగా పుస్తకాన్నే రాసేసింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసిస్తున్న తన్వి లాక్డౌన్ సమయంలో కవిత్వాలతో ఓ పుస్తకాన్ని రచించింది.
ఈ పుస్తకానికి ‘ఫ్రమ్ ది ఇన్సైడ్, ద ఇన్నర్ సోల్ ఆఫ్ ఏ యంగ్ పొయెట్’ అని పేరు పెట్టింది. మార్చి 15న మార్కెట్లోకి విడుదలైన ఈ పుస్తకానికి మంచి స్పందన లభిస్తోంది. తనకు కవిత్వాలు రాయడం అంటే చాలా ఇష్టమని.. అదే తనను రచయితను చేసిందంటూ తన్వి చెబుతోంది. అమెరికా, భారత్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో పుస్తకాన్ని రాయనున్నట్టు తన్వి తెలిపింది. తన్వి తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తన్వి తాత కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ వీ. హనుమంత రెడ్డి కావడం విశేషం.