భారత్ నుంచి వెంటనే వచ్చేయండి.. దేశపౌరులకు యూఎస్ సూచన!

ABN , First Publish Date - 2021-05-08T15:01:36+05:30 IST

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి తమ దేశ పౌరులకు అమెరికా కీలక సూచన చేసింది.

భారత్ నుంచి వెంటనే వచ్చేయండి.. దేశపౌరులకు యూఎస్ సూచన!

వాషింగ్టన్: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి తమ దేశ పౌరులకు అమెరికా కీలక సూచన చేసింది. అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే భారత్ నుంచి స్వదేశానికి వచ్చేయాలని దేశ పౌరులను సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా వీక్లీ నేరుగా చాలా విమాన సర్వీసులు నడిపిస్తున్నాయని, వీటి ద్వారా సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెట్ తన ప్రకటనలో అమెరికన్లను కోరింది. అలాగే పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, దోహాల మీదుగా ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఖతార్ ఎయిర్‌వేస్ నడిపిస్తున్న విమానాల ద్వారా కూడా అమెరికా చేరుకోవచ్చని తెలియజేసింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత్‌లో ఉన్న అమెరికన్లు వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని కోరింది.


అయితే, విమానం బోర్డింగ్ సమయంలో ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారం కూడా అమెరికా ఇదే విధంగా తమ దేశ పౌరులను వెంటనే భారత్ నుంచి వచ్చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే ఎట్టిపరిస్థితుల్లో భారత్‌కు ప్రయాణించకూడదని కూడా హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. 'లెవల్-4' హెచ్చరికలు కూడా జారీ చేసింది.


Updated Date - 2021-05-08T15:01:36+05:30 IST