సోషల్ మీడియా తప్పుడు ప్రచారానికి.. ప్రజల ప్రాణాలు బలి: బైడెన్
ABN , First Publish Date - 2021-07-18T13:37:16+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుడు సమాచారంతో సోషల్ మీడియా సంస్థలు ప్రజలను చంపేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా సంస్థలపై జో బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్, జూలై 17: కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుడు సమాచారంతో సోషల్ మీడియా సంస్థలు ప్రజలను చంపేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పు అని యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రకటించిన మరుసటి రోజే బైడెన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యాక్సిన్లకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తి జరుగుతోందని మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందించారు. మహమ్మారి వ్యాక్సిన్ తీసుకోని వారి మధ్యనే ఉందని పేర్కొన్నారు. ఇక తాజా అంశంపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి డాని లీవర్ స్పందించారు. ఫేస్బుక్పై 200 కోట్లకు పైగా మంది కొవిడ్-19, వ్యాక్సిన్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వీక్షించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అధికారిక ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని ట్విటర్ ఒక పోస్ట్ ద్వారా పేర్కొంది.