ట్రంప్ మరో కీలక నిర్ణయం.. రాజధానిలో ఎమర్జెన్సీ
ABN , First Publish Date - 2021-01-12T16:58:05+05:30 IST
మరికొన్ని రోజుల్లో అధ్యక్షపీఠం దిగబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

వాషింగ్టన్: మరికొన్ని రోజుల్లో అధ్యక్షపీఠం దిగబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం వైట్హౌస్ ఎమర్జెన్సీ ప్రకటన విడుదల చేసింది. గత బుధవారం వాషింగ్టన్ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు నలుగురు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితిని విధించారని వైట్హౌస్ వెల్లడించింది. జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ఉంటుందని ప్రకటించింది.
మరోవైపు రాజధాని వాషింగ్టన్తో పాటు దేశంలోని 50 రాష్ట్రాల రాజధానుల్లోని కేపిటళ్లపై దాడికి కుట్రలు జరుగుతున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) హెచ్చరించింది. బైడెన్ ప్రమాణ స్వీకారానికి సమయంల దగ్గర పడుతున్న కొద్దీ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఎఫ్బీఐ హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా రాజధానిలో ఎమర్జెన్సీ విధించారు. "ఇవాళ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. గత వారం ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది." అని వైట్హౌస్ తన ప్రకటనలో పేర్కొంది.
ఇక ఎమర్జెన్సీ కారణంగా స్థానికులకు తలెత్తే సమస్యలను పరిష్కారానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా)లను రంగంలోకి దింపుతున్నట్లు వైట్హౌస్ తెలిపింది. బుధవారం నాటి హింసాత్మక సంఘటనతో కేపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి. జాతీయ స్థాయి ప్రత్యేక ప్రాముఖ్యత గల (ఎన్ఎస్ఎస్ఈ) 59వ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. జాతీయ నిఘా సంస్థ సీక్రెట్ సర్వీస్తో సహా డజన్ల కొద్దీ భద్రతా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తాయి. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు.