ఇండియాకొస్తున్నా.. ఇల్లు ఖాళీ చేయండి అన్న ఎన్నారై.. అద్దెకు ఉన్న వ్యక్తి అది కుదరదన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-11-07T03:08:36+05:30 IST
తన ఇంట్లో అద్దె కుంటున్న వ్యక్తిని ఖాళీ చేయించేందుకు ఆపసోపాలు పడుతున్న ఓ ఎన్నారైకి హై కోర్టులో స్వాంతన దొరికింది.
ఇంటర్నెట్ డెస్క్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిని ఖాళీ చేయించేందుకు ఆపసోపాలు పడుతున్న ఓ ఎన్నారైకి హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలంటూ అద్దెకు ఉన్న వ్యక్తిని కోర్టు ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..పంజాబ్కు చెందిన హరిచరణ్ సింగ్ కొన్నేళ్లుగా కెనడాలో నివిస్తున్నారు. అయితే..భారత్కు వచ్చేద్దామనుకున్న ఆయన తన ఇంట్లో అద్దెకు ఉంటున్న హరిజిత్ సింగ్ను ఇల్లు ఖాళీ చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే అతడు రెంట్ కంట్రోలర్ వద్ద రెంట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. హరిజిత్ సింగ్ ఇల్లు ఖాళీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రెంట్ కంట్రోలర్ తగు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. హరిచరణ్ వాదనతో ఏకీభవించని హరిజిత్ సింగ్ 2015లో పంజాబ్ హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. సదరు ఎన్నారైకి భారత్లో అనేక ఆస్తులు ఉన్నాయని, ఇదొక్కటే కాదని కూడా పేర్కొన్నారు. తనకున్న ఆస్తుల వివరాలను తన రెంట్ పిటిషన్లో హరిచరణ్ పేర్కొనలేదని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. హరిచరణ్ కూడా కోర్టులో లాయర్ ద్వారా తన వాదన వినిపించారు.
తన భవనంలోని ఒక అంతస్తును మాత్రమే హరిజిత్ సింగ్కు అద్దెకు ఇస్తే, భవనం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని హరిచరణ్ ఆరోపించారు. ఇంటి యజమాని అయిన ఎన్నారై భారత్కు తిరిగి వస్తుంటే.. అద్దెకున్న వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని, ఈ విషయంలో అద్దెకున్న వ్యక్తి చేసిన వాదనలేవీ చెల్లుబాటు కావని పేర్కొన్నారు. కాగా.. న్యాయస్థానం ఎన్నారై వాదనలతో ఏకీభవించింది. సెక్షన్ -13బీ కింద అద్దెకుంటున్న వ్యక్తిని ఖాళీ చేయించాలనుకుంటున్న ఎన్నారై తాను ఇండియాకు తిరిగి వస్తున్నట్టు, తన సొంత అవసరాల కోసం ఆ ఇంటిని వాడుకునేందుకు నిర్ణయించుకున్నట్టు నిరూపించగలిగితే చాలని కోర్టు తేల్చి చెప్పింది. హరిజిత్ సింగ్ వాదనలను తోసి పుచ్చుతూ వెంటనే ఖాళీ చేయాలని తాజాాగా స్పష్టం చేసింది.