ఘనంగా తెలుగుదేశం Melbourne ఆత్మీయ సమ్మేళనం!
ABN , First Publish Date - 2021-12-12T23:36:08+05:30 IST
తెలుగుదేశం Melbourne వారు ఆత్మీయ సమ్మేళనం పేరుతో మెల్బోర్న్లో సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం Melbourne వారు ఆత్మీయ సమ్మేళనం పేరుతో మెల్బోర్న్లో ఓ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు. సమావేశానికి ముందు.. ఇటీవల అమరులైన త్రివిధ దళాధిపతి బిపిత్ రావత్, ఆయన సైనిక బృందానికి, అమరావతి రైతులు ఉద్యమంలో అమరులయిన రైతులకు సంతాపం తెలుపుతూ సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో పలువురు ప్రసంగిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వాడుతున్న భాష కూడా అభ్యంతరకరమైనదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం గురించి వైసీపీ విస్మరించిందని, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రుల భవిష్యత్తు బాగుపడుతుంది వారందరూ అభిప్రాయపడ్డారు. సమాజంలో చెడు ప్రవర్తనలకు ఆస్కారం ఇచ్చేలా.. రాజకీయాలను పూర్తిగా బ్రష్టుపాటించేలా.. వైసీపీ నాయకుల ప్రవర్తన, పరిపాలన ఉందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం Melbourne సభ్యులు తెలిపారు.
పరిపాలనలో "మంచి" అంటే ఆయుధాలతో లేదా ప్రజల మనోభావాలతో యుద్ధాలు చేయడం కాదని, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమించడమని వారు వ్యాఖ్యానించారు. NRIలుగా తాము ప్రజలను చైతన్యపరుస్తూ, అవగాహన కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులని చేస్తూ.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అవసరాన్ని ప్రజలకు తెలియ జేస్తామని ఈ సందర్బంగా వారు ప్రతిజ్ఞ బూనారు. ఈ సమావేశానికి అభినందనలు తెలుపుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు శుభాకాంక్షలతో కూడిన లేఖను తమకి పంపారని పేర్కొన్నారు.