భారత్లో కోవిడ్ సహాయార్ధం.. నిరంజన్ టీమ్ & ఫ్రెండ్స్ 'తానా'కు లక్ష డాలర్ల విరాళం
ABN , First Publish Date - 2021-05-04T13:49:23+05:30 IST
ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలుగు వారికి సహాయంగా టీమ్ నిరంజన్ మరియు ఫ్రెండ్స్ తరుపున లక్ష డాలర్లు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు నిరంజన్ శృంగవరపు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ మొత్తాన్ని అతి త్వరలో తానా ఫౌండేషన్కి అందజేస్తాం. తెలుగువారి సేవ కోసం వినియోగిస్తాం. దీనితో పాటు తెలుగు కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాం. కోవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా లక్ష డాలర్లు వ్యక్తిగతంగా విరాళాలు సేకరించి ఇచ్చాము. అలాగే మూడు కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించి తానా ఫౌండేషన్ ద్వారా పదిహేను స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఒక లక్ష కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేయడం జరిగింది. మూడు లక్షల మందికి అన్నదానం చేశాం. ఆరు లక్షల మాస్కులు అందించాం. తెలుగువారి సేవ కోసం టీం నిరంజన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. వారికి ఎటువంటి ఆపద ఎదురైనా సహాయం చేయడానికి, ఆదుకోవటానికి నడుంబిగించి కదులుతుంది." అని అన్నారు.