లండన్‌లో ఘనంగా 'టాక్' అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN , First Publish Date - 2021-03-09T20:14:40+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్‌లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మంత్రి సునీతా లక్షారెడ్డి హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా 'టాక్' అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ముఖ్య అతిథిగా తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి 

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్‌లైన్  ద్వారా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మంత్రి సునీతా లక్షారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూకేలోని మహిళలతో పాటు  ప్రపంచవ్యాప్తంగా  వివిధ సంస్థల మహిళా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్మారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించి మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. 


ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు. మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేకించి మహిళల సంరక్షణ, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు.


ఈ సంధర్భంగా టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తల్లిదండ్రులు ఆడపిల్లలు, అబ్బాయిలను సమానంగా చూడాలని కోరారు. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో స్ఫూర్తి నింపాలని తెలిపారు. నేడు మహిళలు ఒంటరిగా ప్రపంచలో ఎక్కడికైనా వెళ్లగలిగే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఎన్నో సంస్థలకు మహిళలు నాయకత్వం వహించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.


అలాగే టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులకు ధీటుగా అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచమంతా జరుపుకునేదిగా ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి మహిళలను ఉత్తేజ పరిచే గీతాలను పాడి అలరించారు. కాగా, ఈ కార్యక్రమానికి సుప్రజ పులుసు అధ్యక్షత వహించారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, న్యూజీలాండ్ నుండి బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ సునీత విజయ్, కువైట్ నుండి నందిని అబాగోని, టాక్ మహిళా విభాగం సభ్యులు జాన్వీ, సుష్మణ, శ్వేతా మహేందర్, ప్రియాంక, మమత, సంధ్య, శోభ, శ్వేత, లక్ష్మి, యూకేలో నివసిస్తున్న ఇతర మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T20:14:40+05:30 IST