యువతకు బుద్ధిబలం, భుజబలం, దైవబలం ఆవశ్యకం: వద్దిపర్తి పద్మాకర్
ABN , First Publish Date - 2021-02-08T22:12:08+05:30 IST
సింగపూర్: నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం ఆవశ్యకమని ప్రణవ పీఠం సంస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చెప్పారు.
సింగపూర్: నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం ఆవశ్యకమని ప్రణవ పీఠం సంస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చెప్పారు. "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఆధ్వర్యంలో, సింగపూర్లో నివసించే తెలుగువారినుద్దేశించి అంతర్జాల వేదిక ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ నుంచి పాల్గొన్న సభ్యులు అడిగిన ధర్మ సందేహాలకు ఆయన నివృత్తి మార్గాలను ఉపదేశించారు. పిల్లలు సన్మార్గంలో నడవడానికి చిన్ననాటి నుంచే వారికి సత్ సాంగత్యం అలవాటు చేయాలని చెప్పారు.
అనంతరం వాస్తు శాస్త్రం, స్వధర్మ నిర్వహణ, జన్మ చక్రం, శైవాగమ శాస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత, నేటి జీవితంలో నైతిక విలువలు మొదలైన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు చెప్పారు.
ప్రవాసాంధ్రులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై వచ్చే ధర్మసందేహాలను వద్దిపర్తి పద్మాకర్ నివృత్తి చేశారని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్ చెప్పారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి మంగిపూడి రాధిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆకుండి స్నిగ్ధ, జగదీష్ కోడె సమన్వయకర్తలుగా, రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకుడిగా వ్యవహరించారు.
పూర్తి కార్యక్రమాన్ని వీక్షించాలంటే కింది లింక్ క్లిక్ చేయండి.