అమెరికాలో 7 లక్షలు దాటిన మరణాలు
ABN , First Publish Date - 2021-10-03T07:46:52+05:30 IST
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 7 లక్షలు దాటింది. డెల్టా వేరియంట్ ఉధృతితో గత మూడున్నర నెలల్లో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు..
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 7 లక్షలు దాటింది. డెల్టా వేరియంట్ ఉధృతితో గత మూడున్నర నెలల్లో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు టీకా పొందనివారే. కాగా, ప్రస్తుతం డెల్టా తీవ్రత తగ్గుతోంది. కొత్త కేసులు రోజుకు సగటున 1.12 లక్షలుగా ఉంటున్నాయి. రెండువారాల క్రితం నాటితో పోలిస్తే ఇవి దాదాపు మూడో వంతు. ప్రస్తుతం రోజుకు 1,900 మంది వైర్సతో చనిపోతున్నారు. అమెరికాలో ఇంకా 7 కోట్ల మందిపైగా టీకా తీసుకోలేదు. కాగా, పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులు కరోనా టీకా కచ్చితంగా తీసుకుని ఉండాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఇంటి వద్దే ఉండి చదువుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
50 లక్షలకు చేరిన ప్రపంచవ్యాప్త మరణాలు
కరోనాతో ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య శుక్రవారం నాటికి 50 లక్షలకు చేరిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. డెల్టా వేరియంట్ ఉధృతితో 25 లక్షల మరణాలు కేవలం గత 236 రోజుల్లోనే సంభవించినట్లు తెలిపింది. కాగా, మృతుల సంఖ్య పరంగా అమెరికా (7 లక్షలు), బ్రెజిల్ (6 లక్షలు), భారత్ (4.48 లక్షలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.