మెక్సికో భామకు విశ్వసుందరి కిరీటం.. మూడో రన్నర్పగా మిస్ ఇండియా
ABN , First Publish Date - 2021-05-18T14:03:43+05:30 IST
మెక్సికో అందాల భామ, ‘మిస్ మెక్సికన్’ ఆండ్రియా మెజాను విశ్వసుందరి-2021 కిరీటం వరించింది. 26ఏళ్ల ఆండ్రియాను 69వ విశ్వసుందరి పోటీలో విజేతగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.
మెక్సికో భామ విశ్వసుందరి
69వ మిస్ యూనివర్స్గా ఆండ్రియా మెజా
మూడో రన్నర్పగా మిస్ ఇండియా అడెలిన్
హాలీవుడ్, మే 17: మెక్సికో అందాల భామ, ‘మిస్ మెక్సికన్’ ఆండ్రియా మెజాను విశ్వసుందరి-2021 కిరీటం వరించింది. 26ఏళ్ల ఆండ్రియాను 69వ విశ్వసుందరి పోటీలో విజేతగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ‘మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు’ అని ఆమె చెప్పిన సమాధానానికి న్యాయనిర్ణేతలు ఫిదా అయిపోయారు. 73 మంది ని దాటుకొని ఆండ్రియా ఈ టైటిల్ గెలుచుకున్నారు. విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న మూడో మెక్సికన్గా నిలిచారు. 2019లో టైటిల్ గెలుచుకొన్న మొట్టమొదటి నల్లజాతీయురాలు, దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని తుంజి కిరీటాన్ని ఆండ్రియాకు అలంకరించారు. కరోనా వల్ల గత ఏడాది పోటీలు జరగలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన ఆండ్రియా మహిళా హక్కుల కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక, మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో మూడో రన్నర్పగా నిలిచారు. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదంటూ మిస్ ఇండియా అడెలిన్ చక్కగా జవాబు చెప్పారు. వస్త్రాధారణ రౌండ్లో హైదరాబాదీ డిజైనర్ శ్రావణ్ కుమార్ రూపొందించిన చీరను ఆమె ధరించారు.