జీతం ఇవ్వని కంపెనీలు.. పాస్‌పోర్టుల స్వాధీనం.. పరాయిదేశంలో భారతీయులకు ప్రత్యక్ష నరకం..!

ABN , First Publish Date - 2021-12-30T23:47:32+05:30 IST

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 62 మంది భారతీయులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. వారు పనిచేసే కంపెనీల యాజమాన్యాలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నాయి..ఆర్థిక కష్టాల్లో ఉన్నామని చెబుతూ జీతాలు ఇవ్వడం కూడా ఆపేశాయి.

జీతం ఇవ్వని కంపెనీలు.. పాస్‌పోర్టుల స్వాధీనం.. పరాయిదేశంలో భారతీయులకు ప్రత్యక్ష నరకం..!

ఇంటర్నెట్ డెస్క్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 62 మంది భారతీయులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. వారు పనిచేసే కంపెనీల యాజమాన్యాలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నాయి..ఆర్థిక కష్టాల్లో ఉన్నామని చెబుతూ జీతాలు ఇవ్వడం కూడా ఆపేశాయి. దీంతో జీవితం వారికి ప్రత్యక్ష నరకంగా మారింది. సుడాన్‌లో చిక్కుకుపోయిన 62 మంది భారతీయుల వ్యథ ఇది. తమని ఆదుకోవాలంటూ అటు సుడాన్ ప్రభుత్వాన్ని ఇటు భారత ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు. 


కడుపు నింపుకునేందుకు, కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు కొన్ని నెలల క్రితం సుడాన్‌కు చేరుకున్నారు. కొందరు అల్ మాసా అనే కంపెనీలో పనిచేస్తుండగా.. మరికొందరు నోబెల్స్ గ్రూప్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. పనిలో చేరిన నాటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. మొదటి నెల జీతమే వారికి అందలేదు. విషయం యాజమాన్యాల దృష్టికి తీసుకెళితే..రేపు మాపు అంటూ అక్కడి అధికారులు తాత్సారం చేశారు. కొన్ని నెలల పాటు అలా వేచి చూశాక ఇక జీతం అందుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా సుడాన్ మిలిటరీ అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అంతకు మునుపే.. ఆ రెండు కంపెనీలు ఉద్యోగుల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నాయి. ఇదేంటని అడిగితే..కంపెనీ పాలసీ అని నోరుమూయించారు. ఈలోపు.. పరిస్థితి తిరగబడటంతో భారతీయ ఉద్యోగులందరూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరిలో చాలా మంది ఏడాదిగా జీతం అందక అష్టకష్టాలు పడుతున్నారు.  


కుటుంబాన్ని పోషించుకునేందుకు పరాయి దేశానికి వలసెళ్లిన వారికి ప్రస్తుతం కుటుంబసభ్యులపైనే ఆధారపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరి కుటుంబాలు మాత్రం ఆర్థికకష్టాల్లో కూరుకుపోయాయి. వీరిని సుడాన్ తీసుకొచ్చిన కాంట్రాక్టర్ శ్రీనివాస రావు.. తిరుగుబాటుకు మునుపే భారత్‌కు చేరుకున్నారని సమాచారం. దీంతో..ఎటూ పాలుపోక వారు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. సుడాన్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పోర్టు లేకపోవడంతో కనీసం భారత్‌కు రాలేక నానా అగచాట్లూ పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు భారత్ ఎంబసీ కొంత మొత్తాన్ని విడుదల చేసింది. ఆ మొత్తాన్ని జాగ్రత్తగా వాడుకునే క్రమంలో వారు ఒంటి పూట భోజనంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. తాము వైద్యసౌకర్యాలు లేని ప్రాంతంలో  ఉంటున్నామని, ఇటువంటి పరిస్థితిలో తమలో ఎవరైనా అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అటు సుడాన్ అధికారులను ఇటు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 


Updated Date - 2021-12-30T23:47:32+05:30 IST