ఇటలీలో దారుణం.. భారత వ్యక్తిని కొట్టిచంపిన తోటి ఇండియన్స్!

ABN , First Publish Date - 2021-02-01T18:40:54+05:30 IST

ఇటలీలో దారుణం జరిగింది. తోటి భారతీయులే 37 ఏళ్ల మరో ఇండియన్‌ను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు.

ఇటలీలో దారుణం.. భారత వ్యక్తిని కొట్టిచంపిన తోటి ఇండియన్స్!

మాస్కో: ఇటలీలో దారుణం జరిగింది. తోటి భారతీయులే 37 ఏళ్ల మరో ఇండియన్‌ను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. గత సోమవారం(జనవరి 25) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విసెంజా ప్రావిన్స్‌లోని అర్జిగ్నానో ఈ దారుణ ఘటన జరిగింది. సోమవారం రాత్రి 10.30 గంటల(ఇటలీ కాలమానం ప్రకారం) ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఓ వీధిలో తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న బాధితుడిని చూసిన స్థానికంగా ఉండే ఓ వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంతసేపటికి బాధితుడు మృతిచెందాడు. ఘటనాస్థలిలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


నిందితులిద్దరూ కూడా భారతీయులేనని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో వారు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా, మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, మిలాన్, టురిన్, బోలోగ్నా, పర్మా నగరాల్లో భారతీయ సమాజం ప్రజలు అధికంగా ఉంటారని సమాచారం. 1990లో ఇండియా నుంచి ఇటలీకి వలసలు పెరిగాయి. 2020 వరకు ఇటలీలో మొత్తం రెండు లక్షల భారతీయ జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.     

Updated Date - 2021-02-01T18:40:54+05:30 IST