భారత సంతతి వైద్య దంపతులకు యూఏఈ 'గోల్డెన్ వీసా'
ABN , First Publish Date - 2021-06-25T15:38:53+05:30 IST
దుబాయ్లో ఉండే భారత సంతతి వైద్య దంపతులకు పదేళ్ల కాలపరిమిత గల యూఏఈ గోల్డెన్ వీసా లభించింది.
అబుధాబి: దుబాయ్లో ఉండే భారత సంతతి వైద్య దంపతులకు పదేళ్ల కాలపరిమిత గల యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. డా. దీపక్ శర్మ, డా. అనుకృతి పాథక్ అనే దంతవైద్య దంపతులు వైద్యనిపుణుల విభాగంలో గోల్డెన్ వీసా పొందారు. మొదట జూన్ 21న దీపక్ శర్మక, ఆ తర్వాతి రోజు అనుకృతి వీసా పొందారు. ఇక గోల్డెన్ వీసా లభించడం పట్ల దీపక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. తాము పొందిన వీసా గడువు 2031 వరకు ఉందని, తమ కూతుళ్లు సీయా, ఐరా కూడా వీసా పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఈ దంపతులు థ్యాంక్స్ చెప్పారు.
రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన దీపక్ శర్మ దంపతులు సౌదీ అరేబియా, నేపాల్, భారత్లో పనిచేసిన తర్వాత 2015లో యూఏఈ వెళ్లారు. ఈ కపుల్ మొదట దుబాయ్లోని ఓ క్లినిక్లో పని చేశారు. ప్రస్తుతం దీరాలోని పోర్ట్ సాయీద్లో సొంత మల్టీస్పెషాల్టీ పాలీ క్లినిక్ నడిపిస్తున్నారు. ఆరేళ్లుగా యూఏఈలో ఉంటున్న ఎప్పుడూ పరాయి దేశంలో ఉన్న ఫీలింగ్ కలగలేదని దీపక్ శర్మ అన్నారు. తనకు రెండో ఇల్లు యూఏఈ అని తెలిపారు. ఇక దీపక్ శర్మ ఆర్థోడాంటిక్స్, డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేయగా, డా. పాథక్ మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి పీడియాట్రిక్, ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు.