కువైట్లోని భారత రాయబారి కీలక ప్రకటన!
ABN , First Publish Date - 2021-03-25T23:31:38+05:30 IST
కువైట్లోని భారత రాయబారి సిబి జార్జి కీలక ప్రకటన చేశారు. కరోనా నేపథ్యంలో ఎంబసీలో ప్రజా సేవలను పదిరోజులపాటు తాత్కాలికంగా నిలిపి వేసినట్టు చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం అందుబాటులో
కువైట్ సిటీ: కువైట్లోని భారత రాయబారి సిబి జార్జి కీలక ప్రకటన చేశారు. కరోనా నేపథ్యంలో ఎంబసీలో ప్రజా సేవలను పదిరోజులపాటు తాత్కాలికంగా నిలిపి వేసినట్టు చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇండియన్ ఎంబసీలో బుధవారం ఏర్పాటు చేసిన వర్చువల్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కువైట్లోని భారతీయులందరూ కొవిడ్ వ్యాక్సిన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారి కోసం ఎంబసీ ప్రాంగణంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిని వినియోగించుకుని రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
స్వచ్ఛంద సంస్థలు, వలంటరీ గ్రూపులు దీనికి తోడ్పాటు అందించాలని కోరారు. తమ సంస్థలోని సభ్యులు.. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా కువైట్లోని భారతీయ విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కూడా ఆయన పలు అంశాలను వెల్లడించారు. జేఈఈ తోపాటు నీట్, నాటా వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం కువైట్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 10-12 తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష నిర్వహణపై త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా చూస్తామని మాటిచ్చారు. సీబీఎస్ఈ, కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.