ఎన్నారైల కోసం పీసీఆర్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విమానశ్రయాలు
ABN , First Publish Date - 2021-06-22T14:44:30+05:30 IST
ఈ నెల 23 నుంచి యూఏఈకి విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భారత్లోని పలు విమానాశ్రయాలు ఎన్నారైల కోసం పీసీఆర్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి.
న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి యూఏఈకి విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భారత్లోని పలు విమానశ్రయాలు ఎన్నారైల కోసం పీసీఆర్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆధ్వర్యంలో దేశంలోని 34 అంతర్జాతీయా విమానశ్రయాల్లో సుమారు మూడోవంతు విమానశ్రయాలు దుబాయ్కు విమానాలు నడుపుతున్నాయి. ఇక తాజాగా భారత్కు యూఏఈ విమాన సర్వీసులు నడుపుతామని ప్రకటించడం, విమానం ఎక్కడానికి ముందు పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేయడంతో విమానశ్రయాల్లో టెస్టింగ్ కేంద్రాల ఏర్పాట్లు కోసం సంబంధిత అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అటు యూఏఈ ప్రకటనతో ఏఏఐ, భారత పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వెంటనే ఎయిర్ పోర్టులను కరోనా పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా విమానశ్రయాల్లో ఈ ఫెసిలిటీ ఉంది. దీంతో దుబాయ్కు విమానాలు నడిపే మిగతా ఎయిర్ పోర్ట్స్లో కూడా పీసీఆర్ కరోనా పరీక్షల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కరోనా కారణంగా స్వదేశంలో చిక్కుకున్న ఎన్నారైలు తాజాగా యూఏఈ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు.