బ్రిటన్ పౌరులకు భారత్ గుడ్ న్యూస్!
ABN , First Publish Date - 2021-10-14T02:31:01+05:30 IST
భారత్లో పర్యటించదలిచిన బ్రిటన్ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఓ శుభవార్త తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో పర్యటించదలిచిన బ్రిటన్ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ శుభవార్త తెలిపింది. భారత్లో పర్యటనలకు సంబంధించి గతంలో విధించిన కఠిన నిబంధనలను తొలగిస్తున్నట్టు పేర్కొంది. ఇకపై బ్రిటన్ వాసులు భారత్ చేరుకున్నాక ముందుగా పది రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
భారత పర్యాటకులపై బ్రిటన్ ప్రభుత్వం గతంలో విధించిన కఠిన ఆంక్షలకు దీటుగా కేంద్రం కూడా ఆక్టోబర్ 1 నుంచీ దేశంలో కాలు పెట్టే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మన టీకా కార్యక్రమాన్ని గుర్తించబోమన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాము విధించిన నిబంధన కారణంగా భారత్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గుర్తించిన బ్రిటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. కొవీషీల్డ్ తీసుకున్న భారతీయులు బ్రిటన్ చేరుకున్నాక క్వారంటైన్లో గడపాల్సిన అవసరం లేదని ఇటీవల స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా బ్రిటన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి బ్రిటన్ను మినహాయిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.